కరోనా బారినపడ్డ 87 వేల మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది.. 74 శాతం ఆ ఆరు రాష్ట్రాల్లోనే!

కరోనా వైరస్‌పై తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముందుండి పోరాటం చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలో మహమ్మారి బారినపడుతున్నారు. వీరిలో కొందరిని మహమ్మారి బలితీసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 87 వేల మంది ఆరోగ్య సిబ్బంది బారినపడ్డారు. అయితే, ఇందులో 74 శాతం మంది మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ్ బెంగాల్, గుజరాత్ ఈ ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకూ కరోనాతో 573 మంది వైద్య, ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. 86 శాతం ఈ ఆరు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 7.3 లక్షల మంది కోవిడ్-19 బారినపడగా.. ఇందులో ఆరోగ్య సిబ్బంది 28 శాతం మంది ఉన్నారు. అక్కడ మొత్తం మరణాల్లో 50 శాతానికిపైగా వైద్య ఆరోగ్య సిబ్బంది కావడం బాధాకరం. ఆగస్టు 28 వరకు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో లక్ష మంది ఆరోగ్య సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. మహారాష్ట్రలో 24 వేల మంది, కర్ణాటకలో 12,260 మంది, తమిళనాడులో 11,169 మంది వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లకు వైరస్ సోకింది. కరోనా బారినపడ్డ వైద్య ఆరోగ్య సిబ్బంది సంఖ్య ఈ మూడు రాష్ట్రాల్లో 55 శాతంగా ఉంది. అలాగే, మహారాష్ట్రలో 292 మంది ప్రాణాలు కోల్పోగా.. తమిళనాడు 49, కర్ణాటక 46 మంది చనిపోయారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది పెద్ద సంఖ్యలో కోవిడ్ బారినపడటం.. మరణాలపై అధికారులు, ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కరోనా యోధులు ముప్పు బారినపడటం మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ పోరాటాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రాలతో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో క్యాబినెట్ సెక్రెటరీ ప్రధానంగా చర్చించారు. కరోనాపై పోరులో కీలకమైన వైద్య ఆరోగ్య సిబ్బంది రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. వైరస్ ముప్పు వీరికి అధికంగా ఉన్నందున వారి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్ఘాటించారు. ఇదిలా ఉండగా.. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన కేవలం 143 మంది వైద్య ఆరోగ్య సిబ్బందికి మాత్రమే రూ.50 లక్ష ఆరోగ్య బీమా చెల్లింపులు చేశారు. మొత్తం 573 మంది మృత్యువాతపడగా.. ఆరోగ్య బీమా చెల్లింపులో భారీ అంతరం ఉంది.


from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2ENnI0l

Comments