ముంబయి: అవమానించిన చోటే కానిస్టేబుల్కు పోలీసులు సత్కారం
పోగొట్టుకున్న చోటే వెతుక్కోమన్నారు పెద్దలు.. ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్కు పోలీసులు సన్మానం చేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని దక్షిణ ముంబయిలో జరిగింది. అక్టోబరు 23న దక్షిణ ముంబయిలోని కల్బాదేవీ ఏరియాలో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళను హెడ్ కానిస్టేబుల్ ఏక్నాథ్ పార్థే ఆపారు. అయితే ఆ మహిళ.. తనను పార్థే దూషించాడంటూ ఆయనపై దాడికి పాల్పడింది. చొక్క పట్టుకుని ఇష్టమొచ్చినట్టు కొట్టింది. దీనిని పక్కనున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. ఆ మహిళ విచక్షణారహితంగా తనను కొడుతున్నా పార్థే సంయమనం కోల్పోకుండా వ్యవహరించారు. కొద్ది దూరంలో ఉన్న సీనియర్లు అరుస్తున్నా ఆయన మాత్రం సహనంతో ఉన్నారు. దీంతో ఆయన పట్ల సోషల్ మీడియాలో సానుభూతి వ్యక్తమయ్యింది. మహిళ చేష్టలను ఖండిస్తూ ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు..మహిళతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడైతే కానిస్టేబుల్పై ఆ మహిళ దాడిచేసిందో అక్కడే ఏక్నాథ్కు గురువారం సన్మానం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో ప్రశంసలు కురుస్తున్నాయి. ‘నిందితులపై తగిన చర్యలు తీసుకోవడమే కాకుండా, హెడ్ కానిస్టేబుల్ పార్టేకు తన నిస్వార్థ సేవను విస్మరించిన ప్రదేశంలో అదే ప్రజల ముందు అతడికి గౌరవం ఇవ్వడం కూడా అంతే ముఖ్యం’ అని పోలీసులు ట్విట్టర్లో పేర్కొన్నారు. కానిస్టేబుల్పై మహిళ భౌతికదాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని మరో ట్విట్ చేశారు.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/2JjLqUt
Comments
Post a Comment