భారత్కు అరుదైన అవకాశం.. 35 ఏళ్ల తర్వాత ఐఎల్ఓ అధ్యక్ష బాధ్యతలు
అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) పాలక మండలి అధ్యక్ష పదవి మరోసారి భారత్ను వరించింది. బోర్డు అధ్యక్షుడిగా కార్మికశాఖ కార్యదర్శి అపూర్వచంద్ర ఎన్నికైనట్టు కేంద్రం వెల్లడించింది. ఆయన 2021 జూన్ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ అధ్యక్షస్థానం 35 ఏళ్ల తర్వాత భారత్కు దక్కడం ఇదే తొలిసారి. దీనివల్ల అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ఠ మరింత ఇనుమడించనుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ విధానాలు, కార్యక్రమాలు, అజెండా, బడ్జెట్, డైరెక్టర్ జనరల్ ఎంపికలో పాలకమండలిదే కీలకపాత్ర. ప్రస్తుతం ఐఎల్ఓలో 187 సభ్యదేశాలుండగా వచ్చే నెల జెనీవాలో జరిగే పాలకమండలి సమావేశానికి అపూర్వచంద్ర అధ్యక్షత వహిస్తారు. ఏడాది మూడుసార్లు ఈ పాలకమండలి సమావేశం అవుతుంది. ఏటా మార్చి, జూన్, నవంబరులో జరిగే ఈ సమావేశాలకు సభ్యదేశాల ప్రతినిధులు హాజరవుతారు. ‘నవంబరులో జెనీవా వేదికగా జరిగే పాలకమండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.. ఈ సందర్భంగా సభ్యదేశాల ఉన్నతాధికారులు, సామాజికవేత్తలతో పలు అంశాలపై చర్చించే అవకాశం లభిస్తుంది.. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అడ్డంకులను తొలగించడానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను అంచనా వేయడానికి ఇది ఒక వేదికను అందిస్తుంది. వ్యవస్థీకృత, అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ సామాజిక భద్రత, దాని ఉద్దేశాన్ని స్పష్టం చేస్తుంది’ అని కేంద్ర కార్మిక శాఖ పేర్కొంది. ఇక, 1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్ ఐఏఎస్ అధికారి అయిన అపూర్వచంద్ర ఏడేళ్లపాటు కేంద్ర పెట్రోలియంశాఖలో పనిచేశారు. అలాగే 2013 నుంచి 2017 వరకు మహారాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత 2017లో రక్షణ శాఖ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. డిఫెన్స్ అక్విజిషన్ కమిటీ ఛైర్మన్గా ఉన్నారు.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/31yvrrO
Comments
Post a Comment