కొనసాగుతోన్న కరోనా విజృంభణ.. నేడు ఆ ఏడు రాష్ట్రాల సీఎంలతో మోదీ సమావేశం
మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం మరోసారి వీడియో సమావేశం నిర్వహించనున్నారు. కేసులు అధికంగా నమోదవుతోన్న ఆంధ్రప్రదేశ్తోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ సీఎంలకు వైరస్ వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్దేశం చేయనున్నారు. దేశంలో నమోదయిన మొత్తం కేసుల్లో 65.5% కేసులు, యాక్టివ్ కేసుల్లో 63 శాతం, కోవిడ్-19 మరణాల్లో 77 శాతం ఈ రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కావాలని నిర్ణయించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రధానితో ముఖ్యమంత్రుల వీడియో సమావేశంలో ఆయా రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ మంత్రులు కూడా పాల్గొంటారు. పంజాబ్, ఢిల్లీ సహా మరో ఐదు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీలో కోవిడ్-19 మరణాల రేటు కనీసం 2 శాతంగా ఉంది. ఈ ఏడు రాష్ట్రాల్లో పాజిటివ్ రేటు జాతీయ సగటు 8.52 శాతాన్ని మించి ఉంది. ‘వైరస్ కట్టడికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ కేంద్రం ముందుకెళ్తోంది. ఆరోగ్య, మౌలిక వసతుల కల్పనకు సహకరిస్తోంది. ఎయిమ్స్ సహకారంతో కేంద్ర ఆరోగ్య శాఖ క్లినికల్ మేనేజ్మెంట్కు సంబంధించి వైద్యులు, ఐసీయూల సామర్ధ్యాన్ని మెరుగుపరచడానికి పూర్తి సహకారం అందజేస్తోంది’ అని కేంద్రం మంగళవారం ఓ ప్రకటన వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ చివరి సారిగా ఆగస్టు 11న ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదయిన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్, బీహార్, గుజరాత్, తెలంగాణ, యూపీ సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. కరోన ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ 10 రాష్ట్రాల్లో కరోనా వైరస్ను ఎదుర్కొంటే మనం విజయం సాధించినట్లేనని ఆ సమావేశంలో సీఎంలతో చెప్పారు ప్రధాని మోదీ. ఇప్పుడు మరోసారి భేటీకానున్న నేపథ్యంలో మళ్లీ ఏం చెబుతారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
from National news in Telugu: Latest India news in Telugu | India News Headlines in Telugu - Telugu Samayam https://ift.tt/3iUHBSz
Comments
Post a Comment