జగన్ ఢిల్లీ టూర్పై భిన్న వాదనలు.. సీఎంపై షా ఆగ్రహం నిజమేనా!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. మంగళవారం హడావిడిగా సీఎం హస్తినకు వెళ్లారు. సాయంత్రం 4 గంటలకు దేశ రాజధానికి చేరుకున్న జగన్.. 6.40 గంటలకు అమిత్షాతో భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాలపాటు అక్కడే ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలు, రావాల్సిన నిధులు, మూడు రాజధానులు, రాజధాని భూములు, ఏపీ ఫైబర్ నెట్, కోర్టు కేసులు వంటి అంశాలపై చర్చించినట్లు సమాచార.. వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బుధవారం సీఎం జగన్ కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో భేటీ కానున్నారు. పోలవరం, ఇతర ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే ఉదయం 10.30కు మరోసారి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రం జగన్ను ఢిల్లీకి పిలిచిందని.. అందుకే ఆయన హుటా హుటిన వెళ్లారనే చర్చ జరుగుతోంది. అంతేకాదు ఏపీ సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఓ వర్గం మీడియా చెబుతోంది. కోర్టులు, జడ్జిలపై వైఎస్సార్సీపీ చేస్తున్న ఆరోపణలపై షా అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారం జరుగుతోంది. అలాగే అంతర్వేది, ఆలయాల్లో విగ్రహాల ధ్వంసంకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అందుకే సీఎంను హస్తినకు పిలిచారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే జగన్ కూడా కేంద్రానికి కొన్ని ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. అమరావతి భూముల వ్యవహారం, ఫైబర్ గ్రిడ్ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మూడు రాజధానుల అంశంపైనా చర్చ జరిగిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా అమరావతి భూములు, ఫైబర్ గ్రిడ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని కోరినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే సీఎం వెంట అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్, న్యాయవాది భూషణ్, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, ప్రభుత్వ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్లు ఉండటంతో ఇటీవల అమరావతి భూముల విషయంలో పరిణామాలను కూడా షాకు వివరించారనే ప్రచారం నడుస్తోంది. అమిత్ షాతో భేటీకి సంబంధించిన అంశాలపై సీఎంవో, ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.
from Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News | Latest News in Telugu https://ift.tt/36cpG6v
via
Comments
Post a Comment